కోసూరువారిపాలెం(మోపిదేవి): ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మహిళ దాసి ధనలక్ష్మీ అధికంగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండల పరిధిలోని కోసూరువారిపాలెం శివారు దాసివాని పల్లె గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసి శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కోసూరువారిపాలెం శివారు దాసి వానిపల్లె గ్రామంలో తన ఇంటిపై ప్రైవేటు పైనాన్స్ కంపెనీ నుంచి వీరు లోన్ తీసుకున్నారు. విడతల వారీగా చెల్లించగా ఇంకా రూ. 40 వేలు బాకీ కట్టవలసి ఉంది. బాకీ నిమిత్తం ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు దుర్భాషలాడటంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం రాత్రి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
రాత్రివేళ వచ్చి వేధించడంతో..
బాకీ చెల్లించాలని నోటీసులు ఇచ్చి కూడా రాత్రి సమయంలో ఇంటికి వచ్చి వేధించడంతో ధనలక్ష్మి అవమానభారంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు శ్రీనివాసరావు కుటుంబం కూలీ పనుల కోసం అవనిగడ్డ మండలం సీతాయలంక గ్రామంలో గత ఆరు మాసాలుగా ఉంటున్నారు. ఫైనాన్స్ కంపెనీ వారి వేధింపుల నుంచి మాకు రక్షణ కల్పించాలని వారు పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


