కొనసాగుతున్న సారె సంబరం అమ్మవారికి బృందాలుగా సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు బృందాలు బుధవారం తరలివచ్చి సారె సమర్పించారు. ఎక్కువగా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కనకదుర్గనగర్, మహామండపం మీదుగా కొండపైకి చేరుకుంటున్న భక్తులు రూ. 100 క్యూలైన్లో ఆలయంలోకి చేరుకుని అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో హుండీ లెక్కింపు జరుగుతుండటంతో నూతన పూజా మండపంలో లక్ష కుంకుమార్చన వేదిక వద్ద ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్త బృందాలు తమతో పాటు విచ్చేసిన భక్తులు, కుటుంబ సభ్యులకు పసుపు, కుంకుమతో పాటు సారె సామగ్రికి ఇచ్చిపుచ్చుకున్నారు. బుధ వారం సాయంత్రానికి 23 బృందాలుగా సుమారు పది వేల మంది భక్తులు సారె సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు.


