యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
మచిలీపట్నంఅర్బన్: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు సోమవారం మచిలీపట్నంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ ఘటనపై యువత చేపట్టిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అణచివేత ధోరణి అవలంబించిందని విమర్శించారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను బలవంతంగా విరమింపజేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొ న్నారు. టెట్కు సంబంధించిన సమస్యల వల్ల లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చలు జరపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఎండీ షౌకత్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, గౌరవాధ్యక్షుడు జె.లెనిన్బాబు, జిల్లా కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వరరావు, కె.రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు జె.ప్రసాదరావు, వివిధ మండల శాఖల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


