మచిలీపట్నంఅర్బన్: ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, గడువులో పరిష్కరించేలా చర్యలు తీసు కోవాలని కృష్ణా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ నవీన్, ఇతర అధికారులకు అర్జీలు అందించారు. ఇన్చార్జి డీఆర్వో ఎస్.పోతురాజు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి.శ్రీనివాసరావుతో కలిసి జేసీ నవీన్ ప్రజల సమస్యలను ఆలకించారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


