● రూ.15.38 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం ● నిందితుల్లో ఇద్దరు హిజ్రాలు
గుడివాడరూరల్: గుడ్లవల్లేరు ఎన్టీఆర్ కాలనీలో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గుడివాడ తాలూకా సీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ పాలా శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వ తేదీన గుడ్లవల్లేరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన పోలగాని నాగేశ్వరమ్మ ఇంటి తాళం పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారని, పోలీసులు కేసు నమోదు చేసి ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారన్నారు. సోమవారం ఉదయం గుడ్లవల్లేరు రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసింది తామేనని అంగీకరించారన్నారు. ఈ దర్యాప్తు ప్రారంభించి నాలుగు రోజుల్లోనే నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితులు విజయవాడ కృష్ణలంకకు చెందిన గాడు నాగరాజు, గుడ్లవల్లేరుకు చెందిన తుమ్మరాడ అంజు అలియాస్ రేవంత్(హిజ్రా), కడవకొల్లు శ్రీనివాస్(హిజ్రా), విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన చుక్క ప్రవీణ్ అని డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.15.38 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన అనంతరం ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో దొంగలు కారం చల్లారన్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో తాలూకా సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


