గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు ఆగస్ట్ 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీల పోస్టర్లను సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, ఫొటో జర్నలిస్టులతో కలిసి గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, స్టూడియో ఫొటోగ్రాఫర్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. మూడు విభాగాల్లో జరిగే ఈ పోటీలకు ఆగస్టు ఐదో తేదీలోగా ఎంట్రీలు పంపాలని సూచించారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేలు, ఆరుగురికి ప్రోత్సాహక నగదు బహుమతులుగా రూ.2 వేల చొప్పున అందిస్తామని వివరించారు. ఒకరు ఒక విభాగం నుంచి మూడు ఫొటోలు చొప్పున తొమ్మిది ఫొటోలు పంపొచ్చని సూచించారు. 2025, జూన్ 12 నుంచి 2026, జులై 31 మధ్య తీసిన ఫొటోలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ– 520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా పంపాలని, ఇతర వివరాలకు డివిజనల్ పీఆర్వో కె.రవి (90101 56550)ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డీఐపీఆర్వో కె.వి. రమణరావు, డీపీఆర్వో టి.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, వి.వి. ప్రసాద్, పలువురు ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.


