చిలకలపూడి(మచిలీ పట్నం): గ్రామాల్లో స్వచ్ఛరథం కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జె.అరుణ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలుగా మండల పరిషత్ ఆదాయ వనరుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని ఆరుణ కోరారు. ఆదాయ వనరులకు మించి పనులు మంజూరు చేసే వాటి వివరాలను కూడా తెలపాలని, లేకుంటే వాటిని వెంటనే రద్దు చేయాలని సూచించారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రెయిన్లతో పాటు తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి నిధులు వెచ్చించి సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ రథం కార్యక్రమంలో నిత్యం మండల పరిధిలోని గ్రామాలను తనిఖీ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించి ఆస్తుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి ద్వారా ఆదాయ వనరులు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనందకుమార్ పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ అరుణ


