రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వేస్టేషన్ను శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్) కింద రూ.12.13 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. నిత్యం 250 రైళ్లు, 1.40 లక్షల మంది ప్రయాణికులతో విజయవాడ రైల్వేస్టేషన్లో అధిక రద్దీ నెలకొనడంతో రాయపాడు స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా ఆధునికీకరించారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక బహుళ అంతస్తులతో స్టేషన్ భవన నిర్మాణాలు జరిగాయి. గ్రీనరి, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫారాల పొడిగింపు, ఎస్కెలేటర్లు, లిఫ్ట్లు, ఫుట్ బ్రిడ్జి, రిజర్వేషన్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, మాడ్యూలర్ టాయిలెట్లు వంటి వసతులు కల్పించారు.


