మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కృష్ణా డెల్టా, పులిచింతల, పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేఎల్రావు ఆలోచనా విధానంతో దివంగత ముఖ్యమంత్రి అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. 2004కు ముందు సాగు నీటి విషయంలో పరి స్థితి ఎలా ఉంది.. 2004 తర్వాత వైఎస్సార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. తాగునీరు ప్రాజెక్టుల విషయంలో టీడీపీ బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక పక్క అనుమతుల కోసం పనిచేస్తూనే మరో పక్క కుడి ఎడమ కాలువ పనులను వైఎస్సార్ ప్రారంభించటం ఆయన ముందు చూపు, దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొన్నారు. పోలవరం తదితర ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకునేందుకు టీడీపీ పనిచేసిందని.. రైతులతో కేసులు వేయించారని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పనులను అవనిగడ్డలో ప్రారంభిస్తే వాటిని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. పట్టిసీమలో కేవలం మోటార్లను ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేసి తామే అంతా చేసినట్లు బిల్డప్ ఇస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఆ కాలువల నుంచే నీళ్లు తరలిస్తూ అంతా తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాను దూర దృష్టి కలిగిన వాడినని ముందు చూపుతో అన్నీ చేస్తానని చెప్పే చంద్రబాబు ఎల్నినో ప్రభావంతో ప్రజలు రైతులు అవస్తలు పడుతుంటే ఏం చేశారని మల్లాది విష్ణు సూటిగా ప్రశ్నించారు.


