గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ పారామెడికల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బంది సేవలు నిరుపమానం అన్నారు. కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడటం కోసం అనేకమంది ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. గత 15 ఏళ్ల నుంచి ఉద్యోగ భద్రత లేక కాంట్రాక్ట్ విధానంలోనే విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికై నా స్పందించి పారామెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్ నర్సస్ను రెగ్యులరైజ్ చేయాలన్నారు. భవిష్యత్తు నోటిఫికేషన్లో గవర్నమెంట్ మెడికల్ విభాగంలో అన్ని పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో మరణించిన కాంట్రాక్ట్ ఎంప్లాయిస్కు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. జేఏసీ ప్రతినిధులు కోటేశ్వరరావు, సతీష్, మనీషా, రమాదేవి, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కంచికచర్ల: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చెవిటికల్లు గ్రామానికి చెందిన విద్యార్థిని జగ్గయ్యపేటలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం విద్యా శాఖ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆమె రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఇంట్లోకి వెళ్లి విద్యార్థినిని కిందకు దించారు. కంచికచర్ల ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయ వాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు ఇంటర్మీడియెట్ – 2026 ఫలితాలలో చక్కని ఫలితాలను సాధించినట్లు ఎన్టీఆర్ జిల్లా అధికారులు ప్రకటించారు. జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలలో మొత్తం 804మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 700 మంది ఉత్తీర్ణతను సాధించి, 87శాతం నమోదు చేశారన్నారు. ముప్పాళ గురుకులం (100), కుంటముక్కల (98), రంగాపురం (97), నర్సాపురం (96), జగ్గయ్యపేట (95), బల్లిపర్ర (91) శాతం చొప్పున విజయాలను అందుకున్నాయన్నారు. సీనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలకు సంబంధించి మొత్తం హాజరైన విద్యార్థులు 944 కాగా ఉత్తీర్ణులైన వారు 888 మొత్తం ఉత్తీర్ణత 94 శాతంగా నమోదైంది.


