నల్ల రిబ్బన్లతో స్పాట్కు హాజరైన ఉపాధ్యాయులు
మచిలీపట్నం అర్బన్: ఉపాధ్యాయులు నిబద్ధతతో, పారదర్శకంగా తమ బాధ్యతలను నిర్వహించడంతో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. సోమవారం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పర్యవేక్షణలో మొత్తం 763 మంది ఉపాధ్యాయులు పాల్గొని జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కచ్చితత్వంతో పాటు సమయపాలనకు ప్రాధాన్యతనిస్తూ మూల్యాంకనం కొనసాగుతోందని తెలిపారు. కేంద్రంలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో ఫ్యాప్టో నిరసన..
ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేశారు.


