మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు ఎన్నికయ్యారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా ఐ.మురహరి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.రమేష్, ఎస్.సుబ్బారావు, కార్యదర్శి పి.బుజ్జి(ఏకగ్రీవం), సంయుక్త కార్యదర్శులుగా ఎల్.సతీష్ వర్మ, కె.రవిశంకర్, కోశాధికారిగా బి.చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వై.హేమాంబిక, ఎం.మాధవీలత, బి.భారతి ఎన్నికయ్యారు. ఎన్నిక తదనంతరం జనరల్ బాడీ సమావేశంలో పది క్లబ్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షుడిగా పి.అజయ్కుమార్, చైర్మన్గా రానాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోఆప్షన్ సభ్యులుగా బి.ప్రేమ్ తేజా, మౌనిక, హర్షలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 33 శాతం సీ్త్రలకు, 25 శాతం క్రీడా సంబంధిత వ్యక్తులను అసోసియేషన్ ద్వారా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి మురహరి తెలిపారు.
కంకిపాడు: జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం...విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీ కంకిపాడు బైపాస్ మార్గంలోకి రాగానే లారీ టైరు పంక్చర్ అయ్యింది. దీంతో లారీ డ్రైవరు లారీని నిలిపివేశాడు. ఇదే మార్గంలో కంకరు లోడుతో వెళ్తున్న టిప్పరు సిమెంటు లోడు లారీని వెనుకగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో టిప్పరు ఇంజిను భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవరు కేబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సుమారు అరగంట పాటు కష్టపడి కేబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవరును అతికష్టం మీద బయటకు లాగారు. గాయాలపాలైన డ్రైవరు ఘంటసాల మండలం అచ్చంపాలెంకు చెందిన తుమ్మపూడి నవీన్ (32)ను 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.


