మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడలో ఈ నెల 9, 10 తేదీలలో నిర్వహించనున్న కొనుగోలుదారులు–అమ్మకందారుల సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతో విజయవాడ గాంధీనగర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా అనేక మంది మహిళలకు బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రోమో వీడియోను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలోని హోల్సేల్, రిటైల్ వ్యాపారులు ఈ సమ్మేళనంలో పాల్గొని మహిళలు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను పరిశీలించి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. మహిళా వ్యాపారవేత్తలకు ఇచ్చే ఒక్క ఆర్డర్ వారి జీవితాలను మార్చగలదని, అందువల్ల వారిని ప్రోత్సహించాలని అన్నారు. గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఐసీ జీఎం వెంకటరావు, ఉద్యాన అధికారి జె.జ్యోతి, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ సౌమ్య, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ నిఖిలశ్రీ , ఏడీఐఓ సెల్వినా తదితరులు పాల్గొన్నారు.


