ఖోఖో విజేతలకు బహుమతుల ప్రదానం
గుడ్లవల్లేరు: శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల పర్యవేక్షణలో జేఎన్టీయూకే, కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయ స్థాయి అంతర కళాశాలల ఖోఖో టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యుడు యు.వేణుగోపాలరావు విచ్చేశారు. సుమారు 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ పోటీలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ విజేతగా నిలిచి విన్నర్స్ ట్రోఫీ సాధించింది. మైలవరం లకిరెడ్డి బాలరెడ్డి కాలేజీ రన్నర్స్గా నిలిచింది. మహిళల విభాగంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఐడియల్ ఇంజినీరింగ్ కాలేజ్, కాకినాడ జట్లు ఫైనల్కు చేరాయి. ఫైనల్లో ఐడియల్ ఇంజినీరింగ్ కాలేజ్ గెలిచి విన్నర్స్ ట్రోఫీ సాధించింది. గుడ్లవల్లేరు కాలేజీ రన్నర్స్గా నిలిచింది. విజేతలకు ముఖ్య అతిథి డాక్టర్ యు.వేణుగోపాలరావు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.సిద్ధయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కోదండ రామారావు, పీజీసీఆర్డీ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ఎన్ఆర్వీ ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల కో సెక్రెటరీ – కరస్పాండెంట్ రామకృష్ణ వల్లూరుపల్లి, ఫిజికల్ డైరెక్టర్లు ఎం.శివశంకర్, డి.పూజిత, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖోఖో విజేతలకు బహుమతుల ప్రదానం


