గోమాతకు అరుదైన ఆపరేషన్
చిట్టూర్పు(ఘంటసాల): రెండు నెలలుగా రొమ్ము వాపుతో తీవ్రంగా బాధ పడుతున్న ఆవుకు ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టిన సంఘటన ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. శ్రీకాకుళం పశు వైద్యాధికారి డాక్టర్ దేవిన హరీష్ తెలిపిన వివరాల మేరకు చిట్టూర్పు గ్రామానికి చెందిన మల్లుపెద్ది సాంబశివరావుకు చెందిన ఆవుకు రెండు నెలలుగా రొమ్ము వాపు కారణంగా రొమ్ము భారీగా పెరిగిపోయింది. గత శనివారం శ్రీకాకుళంలోని పశువుల ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హరీష్ను సంప్రదించారు. ఆయన ఆవును పరీక్షించి నమూనాను విజయవాడలోని ఏడీడీఎల్ ల్యాబ్కు పంపించి పరీక్ష చేయించారు. సోమవారం అక్కడ పరీక్షించిన టెక్నీషియన్లు ఆవు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని, అత్యవసరంగా చికిత్స చేయాలని సూచించారు. దీంతో డాక్టర్ హరీష్ చిట్టూర్పులోని సాంబశివరావు పశువుల షెడ్డులో ఆవుకు శస్త్ర చికిత్స ప్రారంభించి మూడు గంటల పాటు శ్రమించి ఆవు రొమ్ములో నుంచి 8 లీటర్ల చీము, 5 కేజీల రక్తంతో కూడిన చీము గడ్డను తొలగించారు. రెండు నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆవును కాపాడిన పశు వైద్యాధికారి డాక్టర్ హరీష్కు రైతు సాంబశివరావుతో పాటు గ్రామానికి చెందిన పాడి రైతులు కృతజ్ఞతలు తెలియజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆపరేషన్లో డాక్టర్ హరీష్కు చిట్టూర్పు ఏహెచ్ఏ కిషోర్, ఇతర ఏహెచ్ఏలు షబ్బీర్, బాజీ సహాయం చేశారు.


