ఏడు కిలోల గంజాయి స్వాధీనం
కృత్తివెన్ను: మారుమూల పల్లెలకు సైతం గంజాయి విక్రయాల జోరు పెరిగిందనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. మండల పరిధిలోని చినపాండ్రాక పంచాయతీలో రామాపురం గ్రామ సమీపంలో ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. దీనిపై ఆయన శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై పైడిబాబుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా సీఐ మాట్లాడుతూ రామాపురం గ్రామంలోని చెరువులపై పని కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సోమనాథ్ బిక్రం అనే వ్యక్తి గంజాయిని తీసుకువచ్చి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఏర్పాటుచేసిన నిఘాతో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోమనాథ్తో పాటు కృత్తివెన్ను, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికై నా సరే గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చేపలు, రొయ్యల చెరువులపై పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చే రైతులు వారి పూర్తి వివరాలు ఆధారాలతో సహా తమ వద్ద ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు పోలీసులకు సహకరించాలన్నారు. నిందితులను పట్టుకోవడంతో పాటు, గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో మంచి ప్రతిభ చూపిన ఎస్ఐతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు.


