కోతకు రాని వరిని కోయవద్దు
రైతులకు కలెక్టర్ విజ్జప్తి
పమిడిముక్కల: కోతకు రాని వరిని కోయవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు సూచించారు. వరికోత యంత్రం వచ్చిందని తొందరపడి కోత కోయవద్దని, దీనివల్ల నాణ్యతలో తేడా వస్తుందని చెప్పారు. అవసరమైతే మళ్లీ వరికోత యంత్రం పంపించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని కపిలేశ్వరపురం రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందిని ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. గోనె సంచుల నాణ్యత పరిశీలించారు. ధాన్యం రవాణా, కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం తీసుకెళ్లవద్దని, రైతు సేవా కేంద్రంలో ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ గణేష్రెడ్డి, తహసీల్దార్ నవీన్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్ ఆట వల్ల ఏకాగ్రతతో పాటుగా మానసికంగా కూడా చాలా ప్రశాంతతను పొందవచ్చునని రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి ఎం.రాంప్రసాద్రెడ్డి అన్నారు. స్థానిక మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2025ను మంత్రి రాంప్రసాద్రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ జి.ఇన్యాసమ్మతో కలిసి చెస్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె.జగదీష్, అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ఈ నెల 24వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్రా చెస్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 600 మందికి పైగా చెస్ ప్లేయర్లు పాల్గొంటారని చెప్పారు. ఈ టోర్నమెంట్లో విజేతలకు రూ.8 లక్షల విలువైన బహుమతులను అందజేస్తామని చెప్పారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్ సీనియర్ అడ్వయిజర్ కేవీవీ శర్మ, స్టెల్లా కళాశాల కోచ్ వి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్
రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం (స్మృతి వనం) ప్రాంగణంపై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ నెల 26న వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పీజేఆర్ సుధాకరబాబు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత పట్ల ప్రభుత్వం చూపుతున్న అలసత్వ వైఖరిపై పెద్ద ఎత్తున నిరసన తెలియచేయనున్నట్లు చెప్పారు. విజయవాడ గుణదలలో పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎస్సీసెల్ నేతలు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో కలిసి సుధాకర్బాబు సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే ఏ నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ క్షమించబోదన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పార్టీ సమన్వయకర్తలు, రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
కోతకు రాని వరిని కోయవద్దు


