ఒలింపిక్స్లో పతకమే లక్ష్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): లాస్ ఏంజిల్స్లో 2028లో జరగబోయే ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమని ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ చెప్పారు. ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్–2025లో రికర్వ్ విభాగంలో బంగారు పతకం సాధించిన ఆయన బుధవారం విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీని సందర్శించారు. ముందుగా తన గురువు లెనిన్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధీరజ్ మాట్లాడుతూ ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో బంగారు పతకం పొందడం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నారు. డిసెంబర్లో హైదరాబాద్లో జరుగనున్న సీనియన్ నేషనల్ చాంపియన్షిప్, వచ్చే ఏడాది జనవరిలో టోక్యోలో జరగనున్న ఆసియా క్రీడలు, 2027 జరిగే ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో కూడా పతకాల సాధనే లక్ష్యంగా పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను ఆర్చీరీ ర్యాంకింగ్లో భారతదేశంలో నంబర్–1 స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నానని చెప్పారు. అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆసియా చాంపియన్షిప్ సెమీ ఫైనల్లో కొరియా దేశానికి చెందిన క్రీడాకారులను ధీరజ్ ఓడించడం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి వంటిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెవర వెంకట రమణ, ఉపాధ్యక్షుడు బి.శ్రావణ్కుమార్, గొట్టిపాటి ప్రేమ్కుమార్, జాతీయ ఆర్చరీ క్రీడాకారులు చెరుకూరి డాలి శివాని, సంయుక్త తదితరులు ఽధీరజ్ను సత్కరించారు.
ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్


