స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీ, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల నమోదు అధికారులు, ఇతర సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుస రించి జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆ జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి అంశాలు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, క్లయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పులు, చేర్పులు వంటి అంశా లపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 11వ తేదీ నాటికి మార్పులు, చేర్పులు చేపట్టిన అనంతరం జిల్లాలో 15,45,021 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 7,48,208 మంది పురుషులు, 7,96,762 మంది సీ్త్రలు, 51 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 73 కేంద్రాలను ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రతిపాదించామని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు. భవిష్యత్తులో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాజకీయ పార్టీలు, బూత్స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఆర్డీఓలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, అబుదల్ మతీన్, కొడాలి శర్మ, ఎస్.బాలాజీ, పంతం గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


