రూ.6 లక్షల నగదు బ్యాగ్ పోలీసులకు అప్పగింత
కృష్ణలంక(విజయవాడతూర్పు): బస్సులో దొరికిన రూ.6 లక్షల నగదును ఓ ప్రయాణికుడు పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్న ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం, మధురవాడ మండలం పీఎం పాలెంకు చెందిన శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన వ్యక్తిగత పని మీద బస్సులో ప్రయాణించి విజయవాడ బస్టాండ్లో బస్సు దిగి తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ను మర్చిపోయాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు మాచవరానికి చెందిన ఇంటీరియర్ వర్కర్ ఎం.సునీల్కుమార్ ఆ బ్యాగ్ను చూశాడు. దానిని తీసుకుని అందులో నగదు ఉన్నట్లు గమనించాడు. వెంటనే అతను నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లి నగదు ఉన్న బ్యాగ్ను పోలీసులకు అప్పగించాడు. కొట్టిసేపటికి బ్యాగ్ను పోగొట్టుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన బ్యాగ్ను బస్సులో మర్చిపోయానని, అందులో రూ.6 లక్షలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే నగదు కలిగిన బ్యాగ్ సురక్షితంగా అక్కడ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పోలీసులు ఆ వ్యక్తికి డబ్బు లెక్క చూపించి ధ్రువీకరించి తిరిగి అందజేశారు. దొరికిన వెంటనే బ్యాగ్ను అప్పగించిన సునీల్కుమార్ను పోలీసులు అభినందించారు.


