అబుల్ కలామ్ ఆజాద్కు ఘన నివాళి
కోనేరుసెంటర్: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అబుల్ కలామ్ చిత్రపటానికి జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిన్ననాటి నుంచే అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శించేవారని, అనేక భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. 20వ ఏట ఒక ప్రముఖ పత్రికను ప్రారంభించి సమాజం, చరిత్ర, దేశ భక్తిపై వ్యాసాలు ప్రచురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని వివరించారు. ఆజాద్ స్వాతంత్య్ర సమర యోధుడిగా కాంగ్రెస్ పార్టీలో చురుకై న సభ్యుడిగా వ్యవహరిస్తూ, అనేక సమావేశాలకు అధ్యక్షుడిగా కూడా పని చేశారని పేర్కొన్నారు. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్లతో కలిసి స్వాతంత్య్రోద్య మంలో కీలకమైన పాత్ర పోషించి దేశంపై తనకు ఉన్న భక్తిని చాటుకున్నారన్నారు. జాతీయ సమైక్యత కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. బ్రిటీష్ పాలనను వ్యతిరేకించి స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని చెప్పారు. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించి, ఉద్యమానికి చైతన్యాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయన నిర్భయంగా తన ఆలోచనలను వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారని తెలిపారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశయాలను నెరవేర్చడం, విద్యా రంగంలో సమాన అవకాశాలు అందించేలా చర్యలు తీసుకోవడం, విద్యా ప్రాధాన్యతను అంద రికీ తెలపడం అందరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సీహెచ్ రాజా, పలువురు సీఐలు, ఎస్ఐలు, పాల్గొన్నారు.


