ఘనంగా భక్త కనకదాస జయంతి
చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక కలెక్టరేట్లో శనివారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు పాల్గొని భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాస కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని కొనియాడారు. హరి భక్త సార, మోహన తరంగిణి, రామధ్యాన చరిత్ర వంటివి రచనలు చేసి సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించొచ్చని నిరూపించిన మహానుభావుడని పేర్కొన్నారు. కనకదాస జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి జి.రమేష్, వ్యవసాయశాఖ ఏడీ మణిధర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నెల్సన్పాల్బాబు, మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.


