
ఆక్రమణల పరంపర
సాక్షి ప్రతినిధి, విజయవాడ: స్థలం కనిపిస్తే చాలు పచ్చ నేతలు కబ్జాకు తెగబడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారికి అడ్డూ అదుపు లేకుండాపోయింది. దశాబ్దాల చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ భవనాలను నేలమట్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల కళ్లెదుటే ధ్వంసం కావడంతో శాతవాహన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దురాగతంపై ఇప్పటికే వైఎస్సార్ సీపీతోపాటు, పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చిన రాత్రే భవనాలను నేలమట్టం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాలను కూలగొట్టిన వారే నిర్మించాలని, ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాలేజీని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులు శాతవాహన పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డారు. కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్, కళాశాల సొసైటీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సాంబి రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ నెల 15వ తేదీన సమావేశమై కార్యాచరణ రూపొందించి పోరుబాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
స్వార్థపు ఆటకు బలైన సరస్వతీ నిలయం
తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల స్వార్థపు ఆటకు శాతవాహన కళాశాల బలైంది. 1971వ సంవత్సరంలో శాతవాహన పేరుతో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగటంతో డిగ్రీ కళాశాల హోదా కల్పించారు. దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్వర్యంలో ఈ కళాశాల నడిచేది. బోయపాటి అప్పారావు నుంచి సొసైటీ 2.95 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకొంది. రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోలేదు. ఆ సమయంలో పట్టణ భూపరిమితి చట్టం అమలు చేయడంతో అప్పారావు సోదరి విజయలక్ష్మి 1.50 ఎకరాల స్థలాన్ని సొసైటీకి ఇచ్చారు. శాతవాహన కళాశాల ఉన్న భూమి అగ్రిమెంట్ చేశారని, రిజిస్ట్రేషన్కు బోయపాటి అప్పారావు ముందుకు రావడంలేదని దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కోర్టును ఆశ్రయిం చింది. ఈ వివాదం మొదలైనప్పటి నుంచే పచ్చ నేతలు ఈ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలన్న లక్ష్యంగా పావులు కదిపారు. కూటమి అధికారంలోకి రాగానే కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం శాతవాహన కళాశాల స్థలంపై టీడీపీలోని రెండు వర్గాలు కన్నేసి దొంగాట ఆడుతున్నాయి. రెండు గ్రూపులు ఒకటే అయినా పైకి కత్తులు దూసుకుంటున్నట్లు నటిస్తూ కాలేజీ స్థలాన్ని స్వాహా చేసేందుకు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే రాత్రికిరాత్రే బోయపాటి అప్పారావు, దూళిపూడి శ్రీకాంత్ కళాశాల భవనాలను నేలమట్టం చేశారని, అంతకు మునుపే కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేశారని పూర్వవిద్యార్థులు పేర్కొంటున్నారు. భవనాలను కూలగొట్టిన తరువాత ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, బోయపాటి అప్పారావు, దూళిపూడి శ్రీకాంత్పై కళాశాల స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం చినబాబు డైరెక్షన్లో సాగిందని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. నగరం నడిబొడ్డున కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేస్తున్నా ప్రభుత్వం నోరు విప్పకపోవటం దీనికి బలం చేకూరుస్తోంది.
లయోల కాలేజీపై..
లయోల కళాశాలలో మార్నింగ్ వాకింగ్ చేసే కొంత మంది వ్యక్తులు వాకర్స్ అసోసియేషన్గా ఏర్పడ్డారు. వారు కళాశాల ఆవరణను తమకు ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటూ అక్కడే పలు కార్యక్రమాలను నిర్వహించేవారు. కనీసం కళాశాల యాజమాన్యానికి మాట మాత్రం కూడా చెప్పకుండా ఆ ప్రాంగణం తమ సొంతమైనట్లు కార్యక్రమాలను నిర్వహించే వారు. ఇదేమిటని ప్రశ్నించిన కళాశాల యాజమాన్యంపై ఎదురు దాడికి దిగారు. కళాశాలలోకి రావద్దని వాకర్స్ అసోసియేషన్ సభ్యులను నిలువరిస్తే ఆందోళనకు దిగి కళాశాలపై ప్రభుత్వం నుంచి అనేక రకాల ఇబ్బందులను సృష్టించారు. దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
మొన్న ఎస్ఆర్ఆర్, నిన్న లయోల,
నేడు శాతవాహన కళాశాలపై దందా
స్థలం కనపడితే చాలు కబ్జాలకు
తెగపడుతున్న కూటమి నాయకులు
వేలాది మంది విద్యార్థుల జీవితాలతో
చెలగాటమాడుతున్న వైనం
దాతల ఆశయాలకు తూట్లు
పొడుస్తున్న వైనంపై సర్వత్రా ఆగ్రహం
ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల నగరంలోనే పురాతన మైనది. ఈ కళాశాలలో నందమూరి తారాక రామారావు వంటి ప్రముఖులు చదువుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రము ఖులు గురువులుగా పని చేశారు. అటువంటి కళాశాల ప్రాంగణాన్ని పలువురు ఆక్రమించి భవనాలను నిర్మించుకుంటున్నారు. దీనిపై కొద్ది సంవత్సరాలుగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కళాశాల ఆక్రమణల పర్వంలో పచ్చనేతల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆక్రమణదారులు మరింత విజృంభించి ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆక్రమణల పరంపర