
30న బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ
రామవరప్పాడు: రామవరప్పాడులో ఈ నెల 30వ తేదీన జరగనున్న బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా 10వ మహాసభను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సాయిబాబా ఆలయం సమీపంలో శనివారం మహాసభలు నిర్వహణ నిమిత్తం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికా రంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా నేటికి దాని ఊసే ఎత్తడం లేదన్నారు. జరగబోయే మహాసభల్లో సంక్షేమ బోర్డు పని చేయడం కోసం చేపట్టాల్సిన విధివిధానాలను చర్చించి, భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. అనంతరం 21 మందితో కూడిన ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు అప్పారావు, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గోవింద్ బెనర్జి, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.