కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Apr 22 2025 12:58 AM | Updated on Apr 22 2025 12:58 AM

కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

చిలకలపూడి(మచిలీపట్నం): కోర్టు కేసులకు సంబంధించి వకాలత్‌ లేదా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులను ఉపేక్షించేది లేదని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్‌ మీ కోసం సమావేశ మందిరంలో మీ కోసం కార్యక్రమానికి ముందుగా కలెక్టర్‌ జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు స్పందించి వకాలత్‌లు లేదా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసులంటే చాలా మంది అధికారులు సర్వ సాధారణంగా తీసుకుంటున్నారని, కేసు రేపు వాయిదా ఉండగా ముందు రోజు స్పందిస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ముందుగా తెలిసినప్పటికీ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోకుండా చివరి నిమిషం వరకు ఆగి తన వద్దకు రావడం సరికాదని హితవు పలికారు. ఎవరైనా జిల్లా అధికారి కోర్టు ధిక్కరణకు సంబంధించి నిర్లక్ష్యం వహించి కలెక్టర్‌గా తాను హాజరయ్యే పరిస్థితి తీసుకొస్తే ఉపేక్షించేది లేదని, చివరిసారిగా మరోసారి హెచ్చరిస్తున్నారన్నారు.

పీ 4 ఆదర్శ కుటుంబం వాట్సాప్‌ గ్రూప్‌..

ప్రతి ఒక్క కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్‌(ఉద్యోగుల ఆరోగ్య పథకం) కింద కార్డులు జారీ అయ్యేలా సంబంధిత జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ బాలాజీ చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలో ఒక రోజు సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. ఆలోగా ఈహెచ్‌ఎస్‌లో ఉద్యోగుల పేర్లు నమోదు చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసి వెంటనే నివేదికను అందజేయాలని సూచించారు. గతేడాది నూతన ప్రభుత్వం సాధించిన ప్రగతి, విజయాలపై ఒక పుస్తకం రూపొందిస్తున్నామని అందుకు సంబంధించిన గణాంక వివరాలు, ఫొటోలు, ప్రజల అభిప్రాయాలతో నివేదికను వెంటనే అందజేయాలన్నారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు మిగిలిన అధికారులతో ఒక బృందంగా ఏర్పడి పీ 4 మార్గదర్శి ఆదర్శ కుటుంబం కార్యక్రమం కింద వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇటీవల ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించి వారు ఉన్నత చదువులు చదువుకోవడానికి ధనికులతో అనుసంధానం చేసి అవసరమైన కోచింగ్‌ వసతి కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

24న డీఆర్సీ సమావేశం..

ఈ నెల 24వ తేదీన జిల్లా సమీక్షా సమావేశం(డీఆర్సీ) జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యుల అధ్యక్షతన జరుగుతుందని కలెక్టర్‌ చెప్పారు. ప్రగతి నివేదికలు ఇవ్వని అధికారులు వెంటనే నివేదికలు అందజేయాలని సూచించారు. మీ కోసం అర్జీల పరిష్కారంలో జిల్లా అట్టడుగు స్థాయిలో ఉండటం విచారకరమన్నారు. ఇకనైనా సకాలంలో అర్జీలన్నీ పరిష్కరించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని ఈ విషయమై కిందిస్థాయి అధికారులు సిబ్బంది వరకు సమాచారం చేరవేయాలని సూచించారు. గడువు మీరిన అర్జీలు ఇంకా 28 ఉన్నాయని అత్యధికంగా పోలీస్‌ శాఖలో అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి వచ్చిన అర్జీలకు కలెక్టరే సంతకం చేసి పంపిస్తేనే అది పరిష్కరించినట్లు అవుతుందని ఈ విషయం ప్రతి అధికారి గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ శ్రీదేవి, జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, డ్వామా డీఆర్డీఏ పీడీలు శివప్రసాద్‌, హరిహరనాథ్‌, డీఎస్‌ఓ పార్వతి, డీఎంహెచ్‌ఓ శర్మిష్ట, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మావతి, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈలు లోకేశ్‌, నటరాజు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, డీపీఓ అరుణ, సీపీఓ గణేషు, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement