● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య
ఆసిఫాబాద్: జిల్లాలోని కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన సముదాయంలో గల కార్యాలయంలో బుధవారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికారి వి.సంకేత్ మిత్ర, కలెక్టర్ కె.హరిత, జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి, స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్తో కలిసి కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని అండర్ ట్రయల్ కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కక్షిదారుల పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చార్జ్షీట్ వేసిన, వేయని కేసులకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. బెయిల్ మంజూరైన వెంటనే నిబంధనలు పాటిస్తూ సంబంధిత వ్యక్తులను విడుదల చేయాలన్నారు.
కొనసాగుతున్న క్రీడాపోటీలు
రెబ్బెన: మేడే వేడుకలను పురస్కరించుకుని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఖైరిగూర ఓసీపీలో మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. బుధవారం టగ్ ఆఫ్ వార్, బాల్ ఇన్ బాస్కెట్, మ్యూజికల్ బాల్ వంటి క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం, కార్మికుల ఆత్మగౌరవం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమే మేడే అని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, అడిషనల్ మేనేజర్ విజయకుమార్ సాహో, వెల్ఫేర్ అధికారి రజిని కుమార్, ఏఐటీయూసీ నాయకులు శేషు, రాజేష్, కిరణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


