బూర్గుడలో బస్సు కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు
ఆసిఫాబాద్రూరల్: బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులకు నీడ కరువవుతుంది. నాలుగు వరుసల జాతీయ రహదారి– 363 వెంబడి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో బస్సులు వచ్చే వరకు ప్రయాణికులు ఎండలోనే వేచి చూస్తున్నారు. జాతీయ రహదారి –363 రెబ్బెన మండలం తక్కెలపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిడి మండలం గోయెగాం వరకు విస్తరించి ఉంది. ఈ రహదారిని అనుకుని సుమారు 21 వరకు బస్టాప్లు ఉన్నాయి. వీటిల్లో కేవలం మూడుచోట్ల మాత్రమే షెల్టర్లు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల బస్టాప్లు ఉన్నప్పటికీ నిల్వ నీడ లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
సమస్య ఇక్కడే..
రెబ్బెన మండలంలో తక్కెలపల్లి, పులికుంట, గోలేటి ఎక్స్రోడ్, దేవులగూడ, పుంజుమేరగూడ, నక్కలగూడ, ఇంద్రానగర్, కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఎడవెల్లి, కొండపల్లి, కై రిగాం వద్ద షెల్టర్లు నిర్మించలేదు. అలాగే ఆసిఫాబాద్ మండలంలో బూర్గుడ రహపల్లి రోడ్డు, బూర్గుడ– 2, వాంకిడి మండలంలో ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు, సాలేగూడ, ఇప్పల నవేగాం, జైత్పూర్, ఇందానీ ఎక్స్రోడ్డు, బెండార, సామెలా, గణేష్పూర్, గోయగాం, బాంబార గ్రామాల్లోని బస్టాప్ల వద్ద షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. ప్రయాణికులు వేసవిలో ఎండకు ఎండుతూ వర్షాకాలంలో వానకు నానుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి 50 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి నిర్మించారు. గతంతో ఉన్న షెల్టర్లు తొలగించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు స్పందించి హైవే వెంబడి షెల్టర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.


