ఆసిఫాబాద్అర్బన్: నైపుణ్యాభివృద్ధితో నిరుద్యోగులైన యువత ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ కె.హరిత అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. జీవితంలో స్థిరపడాలంటే యువత నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. తద్వారా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు, మంచి జీతాలు ఇస్తాయని తెలిపారు. బైక్ రిపేరింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, హౌజ్వైరింగ్, ప్లంబింగ్, శానిటరీ, కంప్యూటర్, ట్యాలీ, అకౌంటింగ్, కుట్టు మిషన్, ఆభరణాల త యారీ, బ్యూటీపార్లర్, మగ్గం పనులు, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పీఎం ఇంటర్న్షిప్ పథకం పోస్టర్ ఆవిష్కరించారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన మైనార్టీ గురుకుల విద్యార్థులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారులు రమాదేవి, అశోక్, సురేశ్, నదీమ్, డీఆర్డీవో దత్తారావు పాల్గొన్నారు.


