ఆసిఫాబాద్: నకిలీ విత్తనాల విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గు రువారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఏవో వెంకటి, డీఎస్పీ వహీదొద్దీన్తో కలిసి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం దృష్ట్యా విత్తన సరఫరా, నిల్వలు, నాణ్యతపై ప్రత్యే క దృష్టి సారించాలని, దుకాణాలు, గోదాములను తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, లైసెన్స్లు రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను తనిఖీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల గుర్తింపు, రసీదు స్వీకరణ ప్రాముఖ్యత గురించి వివరించాలని అన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కృషి చేయాలని, నూతన విధానం కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
జనగణనకు ప్రజలు సహకరించాలి
జనగణనకు జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన– 2027 కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు sc.census.gov .in ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని పేర్కొన్నారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు స్వీయ గణన ఐడీ అందించాలని సూచించారు.


