కెరమెరి: పీఎంశ్రీ స్కూల్ సావర్ఖేడా ఇతర పాఠశాలలకు స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని సావర్ఖేడా ప్రాథమిక పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ డేకు డీఈవో లలితతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో విద్యార్థులు క్రమశిక్షణ ఉంటూ చదువులో రాణించడంలో గ్రామస్తుల సహకారం ఎంతో ఉందన్నారు. గ్రామం మద్యపానానికి దూరంగా ఉండడం అభినందనీయమని, ఇది ఐఎస్వో సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉన్న గ్రామంగా అభివర్ణించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడంతో విద్యాసామర్థ్యాలు పెంపొందాయని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో బడి అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడంపై హెచ్ఎం కడేర్ల రంగయ్యను అభినందించారు. అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, సర్పంచ్ కావ్డే తుల్సిరాం తదితరులు పాల్గొన్నారు.


