ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ పరిరక్షణ, సమస్యల సాధనకు ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన ఆదివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉచిత బస్సు పథకం కింద నెలకు రూ.400 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బెడ్ విన్నర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని కోరారు. ట్రేడ్ యూని యన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు దివాకర్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, జేఏసీ నాయకులు సాంబశివ్రావు, మధుకర్, తులసీరాం, శంకర్, కృష్ణ, నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


