ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిర్యాణి మండలం ఎదులపాడ్ పంచాయతీ పరిధిలోని అరటిపల్లిలో అంగన్వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్ మడావి పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని తిర్యాణి మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన హనుమంత్రావు, నిలిపివేసిన పింఛన్ను పునరుద్ధరించాలని కాగజ్నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాజా వేర్వేరుగా వినతులు అందించారు. తన తండ్రి ఉద్యోగం చేస్తూ మరణించాడని, కారుణ్య నియామకం కింద అవకాశం కల్పించాలని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన గడిగోపుల మాన్విత కోరింది. కాన్పూర్ ఐఐటీలో ఫస్టియర్ చదువుతున్న తనకు ల్యాప్టాప్ అందించాలని కౌటాల మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుమ్మరి సంస్కృతి విన్నవించింది. ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాసుపుస్తకంలో ఎకరం స్థలం తక్కువగా నమోదైందని, దీనిని సవరించాలని రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన టేకం భుజంగ్రావు కోరాడు.


