కెరమెరి: మహిమాన్విత పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తానని మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శంకర్లొద్ది గ్రామంలో గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. దేశంలోని 10 కోట్లకు పైగా బంజారాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత రామారావు మహరాజ్ తనపై ఉంచారని పేర్కొన్నారు. ప్రేంసింగ్ మహరాజ్ పిలిపించుకుని పనులు చేయిస్తున్నారన్నారు. అంతకుముందు గుహలోని శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సాగు భూములకు పట్టాలిస్తాం :
ఎమ్మెల్యే దేవ్రావు భోంగ్డె
సరిహద్దు గ్రామాల్లో సాగు భూములకు పట్టాలిస్తామని రాజురా ఎమ్మెల్యే దేవ్రావు భోంగ్డె అన్నారు. శంకర్లొద్దిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రాజూరా నియోజకవర్గంతోపాటు వివాదాస్పద 14 గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోహరాదేవి ఆలయ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం రూ.750 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు సత్యనారాయణ, రమేశ్, ఎస్సై ఎన్.మధుకర్, ఐదుగురు ఎస్సైలు, 120 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపస్వీ ప్రేంసింగ్ మహరాజ్, నిర్వాహకులు అనార్పల్లి మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్, బానోత్ వెంకటి, రూప్లాల్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, కెరమెరి మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు.


