వ్యాధుల కాలం.. టీకాలే రక్ష! | - | Sakshi
Sakshi News home page

వ్యాధుల కాలం.. టీకాలే రక్ష!

Oct 15 2025 6:02 AM | Updated on Oct 15 2025 6:02 AM

వ్యాధ

వ్యాధుల కాలం.. టీకాలే రక్ష!

నేటి నుంచి గాలికుంటు నివారణ టీకాలు నెల రోజులపాటు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యుల సూచన

కౌటాల(సిర్పూర్‌): ఏటా చలికాలంలో పశువులకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనుంది. ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పశువులకు టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు

గాలికుంటు వ్యాధి గేదెలు, ఆవులకు వైరస్‌తో సో కుతుంది. వ్యాధి సోకిన పశువులు బక్కచిక్కి అల్సర్‌ బారినపడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదా లు, నాలుకతోపాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ లేదా నార్మల్‌ సైలెన్‌ వాటర్‌తో శుభ్రం చేయాలి. రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్స్‌ మందులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్‌ మందులు వాడాలి. అలాగే గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా పశు సంవర్థక శాఖ వైద్యుల సలహా మేరకు క్రమంతప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో కలిసి ఒకేచోట ఉంచొద్దు. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. ఒకవేళ పశువు చనిపోతే గోతిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పాతిపెట్టాలని పశువైద్యులు సూచిస్తున్నారు.

నవంబర్‌ 14 వరకు టీకాలు

జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 18 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. ఏడు సబ్‌ సెంటర్లు ఉన్నాయి. ఆవులు 2.32 వేలు, గేదెలు 41 వేలు ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 75 మందికి పైగా సిబ్బంది ఈ నెల 15 నుంచి నవంబర్‌ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్‌ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తారు.

ఉచితంగా టీకాలు వేస్తాం

రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నాం. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 14 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి.

– సురేశ్‌, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి

వ్యాధుల కాలం.. టీకాలే రక్ష!1
1/1

వ్యాధుల కాలం.. టీకాలే రక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement