
‘మహా’ దగాకు చెక్!
బోనస్ కోసం రాష్ట్రానికి సన్నవడ్లు
సొమ్ము చేసుకుంటున్న దళారులు
అడ్డుకునేందుకు చర్యలు షురూ..
సరిహద్దులో చెక్పోస్టుల ఏర్పాటు!
కౌటాల: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పండించిన సన్నవడ్లను దళారులు జిల్లాలోకి అక్రమంగా తరలిస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇక్కడి రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. రూ.500 బోనస్ కొల్లగొట్టే వారి చర్యలకు ఫుల్స్టాప్ పెట్టడానికి సిద్ధమైంది. కొద్దిరోజుల్లో జిల్లాలో వరి పంట చేతికి రానుండగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమాయత్తమవుతోంది. వరి సాగవుతున్న మండలాల్లో ఏటా 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. సన్నాలు పండించిన రైతులకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ ప్రకటించి క్వింటాల్కు రూ.2,389 చెల్లిస్తోంది. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది.
జిల్లాలో 56వేల ఎకరాల్లో సాగు
జిల్లాలోని 15మండలాల్లో రైతులు అధికంగా పత్తి సాగు చేస్తుండగా.. ఆ తర్వాత స్థానంలో వరి సాగు ఉంది. ప్రధానంగా దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, తిర్యాణి ప్రాంతాల్లో వరి సాగు అధికంగా ఉంది. వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా నెలరో జుల్లో పంట చేతికి వచ్చే అవకాశముంది. జిల్లా అధి కార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. యూరియా కొరత కారణంగా పంట దిగుబడిపై ప్రభావం పడి ఈసారి ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గనుంది. సుమారు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పంట సాగులో కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే వి ధానాన్ని తీసుకువచ్చింది. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వివరాలు నమోదు చేస్తున్నారు. రైతు పేరు, సాగు విస్తీర్ణం, రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, పంటకు సంబంధించిన ఫొటో తదితర వివరాలు ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేస్తారు. దీని ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తప్పనున్నాయి.
ఆదేశాలు అమలు చేస్తాం
కొద్దిరోజుల్లో వరి పంట చేతికి రానుంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహిస్తున్నాం. సన్న ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపడతాం. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చే స్తాం. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. ప్రభుత్వం సన్నాలకు అందిస్తున్న బోనస్ను సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకట్, జిల్లా వ్యవసాయాధికారి
సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు
ఈసారి ‘మహా’ దళారుల మోసాన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చే యాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా అధికారులు క సరత్తు చేస్తున్నారు. చెక్పోస్టులు సరిహద్దు ప్రాంతాలతోపాటు జిల్లాలోనూ ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ చెక్పోస్టులో సీసీ కెమెరాలతో ని ఘా పెట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీటితో వాహనాల కదలికల ను రియల్ టైంలో పర్యవేక్షించి, అక్రమాలను అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలోని సిర్పూర్(టీ) మండలంలోని వెంకటపూర్, హుడుల్కి, చింతలమానెపల్లి మండలంలోని గూడెం, వాంకిడి ప్రాంతాలు మహా రాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ యా మార్గాల నుంచి అక్రమంగా ధాన్యం వచ్చే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నా రు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ధా న్యం తీసుకువచ్చే రైతుల సాగు వివరాలు పరిశీ లించాలని ఆదేశాలు వెళ్లాయి. తెచ్చిన ధాన్యం ఎంత.. వచ్చింది రైతులేనా? సాగు చేసింది ఎన్ని ఎకరాల్లో? అన్న వివరాలను వ్యవసాయశాఖ సమాచారంతో ఓపీఎంఎస్ యాప్తో పోల్చుకుని చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

‘మహా’ దగాకు చెక్!