
అప్పులిస్తాం.. దందా చేస్తాం!
మద్యం టెండర్లలో సిండికేట్ పెట్టుబడి పెట్టి నయా దందా అడ్డదారుల్లో లిక్కర్ వ్యాపారం కాగజ్నగర్ కేంద్రంగా స్కెచ్..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లిక్కర్ దందా అడ్డదారులు తొక్కుతోంది. లక్కీ లాటరీలో అమాయకులను ముందు పెట్టి సిండికేట్గా మారిన వ్యాపారులు దందాను తమ గుప్పిట పెట్టుకునేలా ఎత్తువేస్తున్నారు. జిల్లాలో కాగజ్నగర్ కేంద్రంగా పలువురు మద్యం వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడి కండిషన్లతో టెండర్ వేయిస్తూ రూ.లక్షల్లో దండుకునే ప్లాన్ వేశారు. ప్రభుత్వం వచ్చే రెండేళ్ల (2025–27)కు జిల్లాలోని 32షాపుల లైసెన్స్దారుల కోసం టెండర్లు పిలిచింది తెలిసిందే. ఒక్కో షెడ్యూల్ ధర రూ.3లక్షలు కాగా, ఎవరికి లక్కీ డ్రాలో వస్తే వారికే ఆ షాపు కేటాయిస్తారు. అయితే, సింగిల్గా వేస్తే ఆర్థికంగా నష్టపోతామని భావిస్తున్న చాలామంది వ్యాపారులు జట్టుగా వేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కాగజ్నగర్కు చెందిన కొందరు వ్యాపారులు రూ.లక్షల కొద్దీ అప్పులు ఇస్తూ మరీ దందాలోకి దించుతున్నారు. ఎటు తిరిగి తమకే రూ.లక్షల్లో లా భం వచ్చేలా కండిషన్లు పెడుతూ మద్యం వ్యాపారాన్ని తమ గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత వారితో పాటు కొత్తవారిని ఆకట్టుకునేందుకు సింగపూర్, మలేషియా తదితర దేశాలకు విహారయాత్రలను ఎరగా వేస్తున్నారు.
వ్యాపారుల నిబంధనలివే..!
ముందుగా టెండర్ వేసేందుకు రూ.3లక్షలు ఇస్తా రు. లాటరీలో షాపు వస్తే ఖర్చుల కింద రూ.3లక్షలతోపాటు 70శాతం వాటా తీసుకుంటున్నారు. మిగతా వాటా నిర్వాహకులకు ఇస్తారు. ఒకవేళ షాపు రాకపోతే రూ.3లక్షలు అప్పు కింద రెండు నెలల్లోనే వారు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ప్రామిసరీ నోటు, బ్యాంక్ చెక్తో సంతకం చేసి ఇవ్వాలనే నిబంధన విధించారు. ఎవరి పేరు మీద షాపు వచ్చినా నిర్వహణ మాత్రం వారిదే. షాపు అమ్ముకోవాలన్నా, తాము చెప్పిన రేటుతో వారికే విక్రయించాలి. ఇలా పది కండిషన్లు పెట్టా రు. ఒక గ్రూపునకు 33మందికి అవకాశం కల్పించారు. అంటే, రూ.99లక్షలు అప్పుగా ఇచ్చి తర్వాత తిరిగి వసూలు చేసుకునే ప్లాన్ వేశారు. ఈ తీరుగా కాగజ్నగర్లో గ్రూపులుగా ఏర్పడి మద్యం షాపుల టెండర్లలోనే సిండికేట్గా ఏర్పడుతున్నారు.
అధికారులు కట్టడి చేస్తేనే..
పెట్టుబడి ఇస్తామని ఆశ చూపి తర్వాత రెండు నెలల్లోనే తిరిగి తమ డబ్బులు తీసుకోవడం, లేదా లాటరీలో షాపు వస్తే వాటా తీసుకోవడం రెండూ నిర్వాహకులకు లాభం తెచ్చేదే. ముందుగా డబ్బులు పెట్టి మద్యం దుకాణాల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేసే ప్లాన్ వేశారు. ఈ కండిషన్లతో కూడిన బాండ్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది. కొందరు గతంలో రూ.2లక్షలు టెండరు ధర ఉన్నప్పటికీ ఇలాంటి వసూళ్లు చేయడంతో లాటరీ రాకపోవడంతో తిరిగి బాకీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. తాజాగా ఇదే దందా చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్, ఎకై ్సజ్శాఖల అధికారులు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆదిలోనే కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.