ఖమ్మంసహకారనగర్: విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటిన నేపథ్యాన సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండగా, మరికొన్ని పాఠశాలలో అవసరానికి మించి ఉపాధ్యాయులున్నారు. ఈ నేపథ్యాన అవసరమైన చోట్లకు ఉపాధ్యాయులను కేటాయించడం ద్వారా బోధన సాఫీగా జరిగేలా 404 మంది సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేశారు. కలెక్టర్ దివాకర ఆదేశాలతో డీఈఓ సదానందం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉపాధ్యాయులు గురువారం కేటాయించిన పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మండల పరిధిలోనే..
సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలల వివరాలను ఎంఈఓలు డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఈ నివేదికల ఆధారంగా తొలి ప్రాధాన్యత అదే మండలాల్లోని ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. అలాసాధ్యం కాని పక్షంలో సమీప మండలాలకు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. జూలై 31వ తేదీ వరకు ఖాళీలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయులను కేటాయించినట్లు చెబుతున్నారు. గత సంవత్సరం డిప్యూటేషన్ పొంది ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగుతున్న వారు 231 మంది ఉండగా.. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 173 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తంగా 404 మందిని సర్దుబాటు చేసినట్లయింది. ఇదే సమయాన గత సంవత్సరం డిప్యూటేషన్లో ఉన్న 104 మందిని పాత స్థానాలకే కేటాయించారు. కాగా, ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి కేటాయించిన పాఠశాలల్లో చేరేలా ఎంఈఓలు, హెచ్ఎంలు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో సూచించారు.
పలు పాఠశాలలకు 404 మంది
కేటాయింపు


