● ఉమ్మడి జిల్లాలో 816 భవనాల నిర్మాణం ● రూ.10 లక్షల చొప్పున రూ.8.16 కోట్ల నిధులు మంజూరు ● కొనసాగుతున్న శంకుస్థాపనలు | - | Sakshi
Sakshi News home page

● ఉమ్మడి జిల్లాలో 816 భవనాల నిర్మాణం ● రూ.10 లక్షల చొప్పున రూ.8.16 కోట్ల నిధులు మంజూరు ● కొనసాగుతున్న శంకుస్థాపనలు

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

● ఉమ్మడి జిల్లాలో 816 భవనాల నిర్మాణం ● రూ.10 లక్షల చొప్పున రూ.8.16 కోట్ల నిధులు మంజూరు ● కొనసాగుతున్న శంకుస్థాపనలు 16 భవనాలు మంజూరు

‘సీ్త్ర శక్తి’కి వేదికలు..

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలోనే సమాఖ్యల సమావేశాల నిర్వహణ, శిక్షణ కోసం సీ్త్రశక్తి భవనాలు మంజూరు చేశారు. మండలంలో 16 సీ్త్రశక్తి భవనాలకు రూ.1.60 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కూడా పూర్తికాగా, రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

–కందుకూరి శ్యామ్‌కుమార్‌,

ఐకేపీ ఏపీఎం, ఏన్కూరు

ఏన్కూరు: గ్రామీణ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు కేటాయించి వీటి నిర్వహణతో వచ్చే ఆదాయం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా సహకరిస్తోంది. ఈ క్రమంలోనే మహిళా సంఘాల సభ్యుల సమావేశాలు, ఇతర కార్యకలాపాల నిర్వహణ కోసం భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ‘సీ్త్రశక్తి భవనాలు’లుగా పేరు నిర్ణయించిన ఈ భవనాలు ఉమ్మడి జిల్లాకు 816 మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.8.16 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాలో 495, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 321 భవనాలు నిర్మించనుండగా.. గత రెండు, మూడు రోజుల నుంచి అధికారులు, ప్రజా ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తున్నారు.

రెండు నెలల్లో పూర్తిచేసేలా..

సీ్త్రశక్తి భవనాల నిర్మాణాలను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయిస్తారు. కాగా, ఏన్కూరు మండలంలో 16 సీ్త్రశక్తి భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ నిర్మాణాలు జరుగుతాయి. ఏన్కూరు మండలంలో రేపల్లెవాడ, ఆరికాయలపాడు, బురదరాఘవాపురంలో రెండు చొప్పున, లచ్చగూడెం, ఎర్రబోడుతండా, భద్రుతండా, హిమామ్‌నగర్‌, రాజులపాలెంలో, కోదండరామాపురంతండా, కేసుపల్లి, మూలపోచారం, నాచారం, కాలనీనాచారంలో ఒక్కో భవనానికి ఇప్పటికే శంకుస్థాపన చేశారు.

తీరనున్న ఇక్కట్లు

ఇన్నాళ్లుమహిళా సమాఖ్యల సమావేశాల నిర్వహణకు సరైన వేదికలు లేవు. అంతేకాక రికార్డులు ఎక్కడ భద్రపర్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సమాఖ్యలోని గ్రూపు లీడర్‌ ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో అరకొర వసతుల నడుమ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమాన సీ్త్రశక్తి భవనాల నిర్మాణం పూర్తయితే గ్రూపు సభ్యుల సమావేశాలకు చక్కని వేదికలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాక రికార్డుల భద్రతకు డోకా ఉండదు. అలాగే, మహిళా సమాఖ్యల్లోని సభ్యుల నైపుణ్యాల పెంపునకు డీఆర్‌డీఓ ద్వారా శిక్షణ శిబిరాల నిర్వహణకు సైతం వీలు ఏర్పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement