వైరా: మహిళలు పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోగా, ప్రస్తుత పాలకుల విధానాలపైనా బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. సమాఖ్య జిల్లా మహాసభలు శనివారం వైరాలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. మహిళల్లో ప్రగతి శీల మార్పుల దిశగా సమాఖ్య పని చేస్తోందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులకు అనుగుణంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం బిల్లు పేరిట చేస్తున్న యత్నాల్లో అవకాశవాదం దాగి ఉందని చెప్పారు. కాగా, బీజేపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనీస న్యాయం అడగడాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఓ యువతిపై అఘాయిత్యం చేసినా ప్రజాప్రతినిధులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని చెప్పారు. ఇక కాంగ్రెస్ మహిళలకు హామీ ఇచ్చినట్లుగా నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ.. మహిళా చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. సమావేశానికి పోటు కళావతి, దండి శ్రీజ, సీహెచ్ సీతామహాలక్ష్మి, బేబీ రాణి అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా, నాయకులు యర్రా బాబు, దొండపాటి రమేశ్, ఏపూరి లతాదేవి, తాటి నిర్మల, బత్తినేని నీరజ, నల్లమోతు శైలజ, మందడపు రాణి, కర్నాటి నళిని, ఏపూరి పద్మ, కారం కోటమ్మ, లలిత, లక్ష్మి, రంజాన్బీ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య జిల్లా సభల్లో
రాష్ట్ర కార్యదర్శి జ్యోతి


