బోనకల్: రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే కొనుగో లు కేంద్రాల నుంచి మొక్కజొన్నలను తరలిస్తారా అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతి నేని సుదర్శన్ ప్రశ్నించారు. మండలంలోని లక్ష్మీపురం, రావినూతలలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన గోనె సంచులను తామే కొనుగోలు చేశామని, చివరికి లారీని కూడా తమనే తెచ్చుకోమంటున్నారని రైతులు ఆయనకు వివరించారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. బస్తాలు కొనడమే కాక లారీ డ్రైవర్కు క్వింటాకు రూ.80 అదనంగా చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలోని కేంద్రాల్లో వేలాది బస్తాలు కాంటా వేసి ఉండగా, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నందున ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మందా కరుణ, రైతుసంఘం జిల్లా, మధిర డివిజన్ కార్యదర్శులు బొంతు రాంబాబు, దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు మడిపల్లి గోపాల్రావు, కిలారు సురేశ్, మాదినేని వీరభద్రం, గుగులోతు నరేశ్, గుడ్డూరు వెంకటనర్సయ్య పాల్గొన్నారు.


