ఇల్లెందురూరల్: భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువవుతోంది. ఇంట్లో కూలర్, ఫ్యాన్ ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఎండలో పక్షులు నీడ, నీటి కోసం విలవిల్లాడుతుండడాన్ని గుర్తించా. అంతేకాక మా ఇంటి పెరడులో ఓ పక్షి ఎండకు సొమ్మసిల్లి పడిపోవడం చూసి జాలేసింది. దీంతో ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు తాడు కట్టి ఒక మట్టిపాత్ర వేలాడదీశాను. అందులో క్రమం తప్పకుండా చల్లటి నీరు పోస్తున్నా. ఇక్కడకు పక్షులు వచ్చి నీరు తాగి కాసేపు ఉండి వెళ్తున్నాయి. నీరు తాగేందుకు వచ్చిన పక్షులను చూసినప్పుడల్లా నాకెంతో తృప్తిగా ఉంటుంది. మీరూ.. మీ ఇంటి ఆవరణలో చెట్ల కింద ఒక పాత్ర పెట్టి నీరు పోయండి. లేదా చెట్టుకు పాత్రను వేలాడి దీసి నీరు నింపండి. తద్వారా వేసవితాపానికి అల్లాడిపోతున్న పక్షులను ఆదుకునే ప్రయత్నం చేయండి.
–కాసాని పార్థసారధి, స్టేషన్బస్తీ, ఇల్లెందు


