ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ భక్తుల కోలాహలం నడుమ స్తంభాద్రి గుట్ట చుట్టూ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. స్వామి జన్మనక్షత్రం(స్వాతి నక్షత్రం)ను పురస్కరించుకుని శుక్రవారం పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ విగ్రహాలను గుట్టపై ఉన్న ఆలయం నుంచి పల్లకీపై కిందకు తీసుకొచ్చారు. ఆతర్వాత నగర పురవీధుల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామిని తిరిగి గుట్టపైకి చేర్చాక రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని వెలిగించారు. ఇక రాత్రి 7–30 గంటలకు దేవాలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని పండితులు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో జరిగిన కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


