ఖమ్మంసహకారనగర్: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ పేర్కొన్నారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పినా అమలు కాలేదన్నారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు ఏకమొత్తంలో విడుదల చేయడంతో పాటు బకాయి పడిన ఐదు డీఏలు విడుదల చేసి నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలన్నారు. అంతేకాక సీసీఎస్ రద్దు చేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీలు, యూఆర్ఎస్ టీచర్లకు బేసిక్ పే అమలు చేయడంతో పాటు సమ్మె కాలపు వేతనాలు, పెన్షనర్ల బకాయిలు సత్వరం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాల్లో ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యాన ఈ నెల 5న జరిగే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని గజేందర్ కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ కరామత్అలీ, నాయకులు కత్తి నరసింహారెడ్డి, ఎం.పర్వత్రెడ్డి, శ్రీధర్, సైద, నరేందర్, రాము, జగదీశ్, వెంకటేశ్వర్లు, వనజాకుమారి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్


