ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం 9 గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు గరిష్టస్థాయిలో ఉంటోంది. దీంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో పగటి వేళ రహదారులపై జన సంచారం తక్కువగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. మరోపక్క ఎండ తీవ్రత కారణంగా ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
41డిగ్రీలను దాటి...
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం ఖానాపురం, కూసుమంచిలో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధిర, ఏన్కూరులో 41.7, గుబ్బగుర్తి, పెనుబల్లిలో 41.5, నాగులవంచ, రావినూతల, బాణాపురం, పల్లెగూడెంలలో 41.4, తిమ్మారావుపేటలో 41.1, కల్లూరు, రఘునాథపాలెంలో 41 ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు. ఇక నేలకొండపల్లిలో 40.9, పెద్దగోపతిలో 40.8, బచ్చోడులో 40.6, వైరా, చింతకానిలో 40.5, సత్తుపల్లి ఓసీల వద్ద, గౌరారం, తల్లాడలో 40.4, కొణిజర్లలో 40.2, కలెక్టరేట్, తిరుమలాయపాలెంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, మంగళవారం సాయంత్రం ఎండ, వడగాలుల ప్రభావం అంతగా లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.


