ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి
● నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంవైద్యవిభాగం: గర్భిణి కడుపులో పెరుగుతున్న శిశువు లింగాన్ని నిర్ధారించడానికి కట్టడి చేసేలా అమల్లో ఉన్న చట్టం పక్కాగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పీసీపీఎన్డీటీ చట్టంపై జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీజ, న్యాయమూర్తులు డి.రాంప్రసాద్ రావు, వి.శ్రీనయ్య, అదనపు డీసీపీ బి.రామానుజంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలకు సంబంధించి పది కొత్త దరఖాస్తులు, 11 రెన్యూవల్ దరఖాస్తులు ఉండగా పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రతీ స్కానింగ్ యంత్రం వివరాలే కాక అన్ని స్కానింగ్ల వివరాలు ఆన్లైన్లో నమోదయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కడ కూడా మొబైల్ స్కానింగ్ యంత్రాలు వాడకుండా చూడాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్, ఐఎంఏ అధ్యక్షురాలు ఎస్.రెహనా బేగం, కమిటీ సభ్యులు, ఎం.కుముదిని, విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం ట్రంక్రోడ్డులోని వెంకటేశ్వరనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు, వైద్యసేవలపై ఆరాతీశాక మాట్లాడారు. అంతేకాక జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో సిబ్బంది అవసరమైతే వివరాలు అందజేయాలని అధికారులకు సూచించారు. వైద్యాధికారి ఐ.దేవిశ్రీ, ఉద్యోగులు డాక్టర్ మోత్యా, సయ్యద్ షమీమ్, ఎస్.కే.ముదస్సర్ తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఆరోగ్యంగా ఉంటే సమాజ అభివృద్ధికి పునాది అవుతుందని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిత్యం నడక, వ్యాయామం, ప్రకృతి లో సమయం గడిపితే అనారోగ్యం దరిచేరదని తెలిపారు. ఈ ఏడాది చివరల్లా మాతృ, శిశు మరణాలు జిల్లాలో సున్నాకు చేరేలా వైద్యాధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్ పాల్గొన్నారు.


