మధిర: రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదికలోని సిఫారసులపై సమగ్ర చర్చ జరపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. అంతేకాక ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలిగించేవి, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తొలగించి విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలనే అమలు చేయాలని సూచించారు. మధిరలో యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా సిఫారసులు అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. అలాగే, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుచేయడమే కాక పెండింగ్ బిల్లులు, డీఏలు విడుల చేయాలని కోరారు. అంతేకాక సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లు, కేజీబీవీ, సమగ్ర శిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్టు రవి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, రామకృష్ణ, నాగరాజు, వీరయ్య పాల్గొన్నారు.


