హుండీ, టికెట్ల ఆదాయంతోనే ఉత్సవాలు
● బ్రహ్మోత్సవాలకు నిధులు కేటాయించని ప్రభుత్వం ● భక్తుల కానుకలతోనే శ్రీరామనవమి, ముక్కోటి వేడుకలు ● భద్రగిరికి ఫెస్టివల్ ఫండ్ ప్రకటించాలని కోరుతున్న భక్తులు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27న శ్రీరామనవమికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే భక్తులు సమర్పించే హుండీ ఆదాయంతోనే ఉత్సవాలు నిర్వహించాల్సి వస్తోంది. ఏటా ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి సరిపెట్టుకుంటోంది. వేడుకల నిర్వహణకు ఫెస్టివల్ ఫండ్ కేటాయించాలని ఏళ్లుగా భక్తులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తకోటి మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తోంది.
తాత్కాలిక పనులకే అధిక వ్యయం
ముక్కోటికి, శ్రీరామనవమి వేడుకల సందర్భంగా దేవస్థానం అధికారులు తాత్కాలిక పనులు చేపడుతున్నారు. లైటింగ్, పెయింటింగ్, తాత్కాలిక పనులు, చలువ పందిళ్లు, ఏసీలు, ఎల్ఈడీలు తదితర పనుల నిమిత్తం అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. ముక్కోటికి రూ.80 లక్షలకు పైగా, శ్రీరామమనవమికి రూ. కోటిన్నర వరకు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. మిథిలా స్టేడియాన్ని ఆధునికీకరిస్తే షెడ్లు, షామియానాలు, బారికేడ్లు తదితర పనుల వ్యయం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు.
కలగా మారిన ప్రభుత్వ ఫెస్టివల్ ఫండ్..
శ్రీరామనవమికి ప్రభుత్వం రూపాయి విదల్చకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర మాదిరిగా ఏటా రామయ్య ఉత్సవాలకు ఫెస్టివల్ ఫండ్ ప్రకటించాలని కొన్నేళ్లుగా కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో ఉత్సవాలు నిర్వహిస్తే వసతులు, సౌకర్యాలు పెరగటంతోపాటు ఆలయ ఆదాయం అభివృద్ధికి, ఇతర పనులకు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. సుమారుగా ఏడాదికి రూ. ఏడు కోట్లు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీరామనవమికి సమర్పించే పట్టువస్త్రాలకు సైతం నిధులు విడుదల చేయటం లేదనే అపవాదు ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. గత ప్రభుత్వం రామాలయంపై శీతకన్ను వేసిందంటూ, అభివృద్ధి చేసి చూపిస్తామంటూ భద్రాచలంలో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి సీఎంగా నిలబెట్టుకోవాలని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలు ముక్కోటి, శ్రీరామనవమి. నవమి వేడుకలకు సుమారు రూ.2.5 కోట్లు ముక్కోటికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరు భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే. దీన్ని నుంచే అఽధికారులు, ఉద్యోగుల జీత భత్యాలు చెల్లించాలి. దేవస్థానం నిర్వహణ, ఉత్సవాలకు వ్యయం చేయాలి. శ్రీరామనవమికి సెక్టార్ టికెట్ల విక్రయం ద్వారా కొద్దిమేర ఆదాయం సమకూరుతుంది. అయితే ఉత్సవాల ఖర్చు కంటే వ్యయం అధికమని లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఉభయదాతల టికెట్లు వెయ్యి ఉండేవి. వాటి విక్రయం ద్వారా అధిక ఆదాయం లభించేది. కాలక్రమేణా సీఎం సెక్టార్తోపాటు వీవీఐపీ, వీఐపీ సెక్టార్లు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉభయదాతల టికెట్లను 600కు కుదించారు. దీంతో ఆ ఆదాయం కూడా తగ్గింది.


