● షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానాలు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్ సమీపాన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ వద్ద శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు వాహనాలు కాలిపోయాయి. షోరూం బయట వాహనాలు నిలిపి ఉంచగా, మధ్యాహ్నం వేళ ఎండ ప్రభావంతో అకస్మాత్తుగా మంటలు మొదలయ్యాయి. దీంతో రెండు వాహనాలు కాలిపోతూ దట్టమైన పొగలు వెలువడగా, మూడో వాహనానికి కూడా మంటలు అంటుకునే పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు స్థానికులు, వాహనదారులు నీరు, ఇసుక చల్లుతూ మంటలను ఆర్పుతూనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వాహనంతో వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో షోరూంలో పెద్దసంఖ్యలో ఉన్న వాహనాలకు ముప్పు తప్పినట్లయింది. అయితే, వాహనాలకు చార్జింగ్ పెట్టిన సమయాన షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిన ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, కచ్చితమైన కారణాలను షోరూమ్ నిర్వాహకులు వెల్లడించాల్సి ఉంది.
యూ టర్న్ వద్ద మూడు వాహనాలు ఢీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం మమత రోడ్డులోని ఈఆర్ఆర్ రిసార్ట్స్ సమీపాన యూ టర్న్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో మూడు వాహనాలు ఢీకొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందిరానగర్ జంక్షన్ వైపు వచ్చిన వాహనదారుడు యూ టర్న్ వద్ద తిరుగుతుండగా, ట్యాంక్ బండ్ వైపు నుంచి వచ్చిన వాహనం ఢీకొంది. ఇదే సమయాన వెనుకాల ఉన్న మరో వాహనదారుడు కూడా ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, పలువురు గాయపడడమే కాక కొందరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, సరైన మార్కింగ్ లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడమే కాక వాహనదారులు వేగంగా వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


