‘చేయూత’కు నిధులతో కొత్త పింఛన్లు
పాఠశాలల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనంతో విద్యార్థులకు లబ్ధి
ప్రాజెక్టులకు
సీతారామ
ప్రాజెక్టు (ఫైల్ )
సీతరామకు తగ్గించి.. ఎర్రుపాలెంకు పెంచి..
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. సీతారామ ప్రాజెక్టుకు గత ఏడాదితో పోలిస్తే నిధులు తగ్గినప్పటికీ ఎర్రుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు పెంచారు. గత ఏడాది సీతారామ ప్రాజెక్టుకు రూ.699.35కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.336.78 కోట్లతో సరిపెట్టారు. ఈ నిధులతో భూసేకరణతోపాటు టన్నెల్ పనులు, ఇతర పెండింగ్ పనులు చేపడతారు. ఎర్రుపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు గత ఏడాది రూ.39.99 కోట్లే కేటాయిస్తే ఈసారి అది రూ.370.99 కోట్లకు చేరింది. ఈ పథకం పూర్తయితే మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 33,025 ఎకరాలకు నీరు అందుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు నిధులు పెంచగా, భక్తరామదాసు, తాలిపేరు, లంకాసాగర్, కిన్నెరసాని ప్రాజెక్టులకు సైతం నిధులు అందనున్నాయి.
ఇందిరమ్మ రెండో విడత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లాలో మరింత మంది నిరుపేదలకు ఇళ్లు దక్కనున్నాయి. మొదటి విడతగా 16,524 ఇళ్లు కేటాయించగా కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక రెండో విడత మంజూరు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
అల్పాహారం, మధ్యాహ్న భోజనం
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 2026–27 విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం సమకూర్చనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి రానుంది. అంతేకాక పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు కేటాయింపు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 కొత్త కోర్సులపై ప్రకటన వెలువడింది. దీంతో జిల్లాలోని 1,400 పాఠశాలల్లోని 70వేల మంది విద్యార్థులు, 21 జూనియర్ కళాశాలల్లోని 6,500 మంది విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది.
కొత్త పింఛన్లకు మోక్షం
చేయూత పథకానికి నిధులు కేటాయించిన నేపథ్యాన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో అన్నిరకాల పింఛన్దారులు 1,82,752 మంది ఉన్నారు. ఇదే సమయాన కొత్తగా పింఛన్ల కోసం 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన క్రమాన వీరిలో అర్హులకు మంజూరు కానున్నాయి.
బీమాతో ధీమా
ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలోనే ప్రభుత్వం ప్రమాదబీమా పథకాన్ని ప్రకటించింది. అలాగే క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లను ప్రకటించింది. ఇందుకు గాను నిధులు కేటాయించడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు భరోసా లభించనుంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో జిల్లాలోని 13,317 మంది ఉద్యోగులు, 13,048 మంది పెన్షనర్ల చికిత్సకు అవకాశం ఏర్పడుతుంది.
సంక్షేమ పథకాలకు పుష్కలంగా..
సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి (200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్), రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు పలు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో జిల్లాలోని లబ్ధిదారులకు ఉపయోగపడనున్నాయి.
ఎర్రుపాలెం లిఫ్ట్, సీతారామకు రూ.700కోట్లకు పైగానే..


