● జిల్లాలో కీలక మార్గాల విస్తరణకు గ్రీన్సిగ్నల్ ● నాలుగు వరుసలుగా ఆధునికీకరణ
మధిర: జిల్లాలోని పలు రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.594 కోట్ల నిధులు మంజూరయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కీలకమైన ఐదు మార్గాల విస్తరణకు గ్రీన్సిగ్నల్ లభించగా ఉగాది పండుగ రోజున ప్రకటన వెలువడింది. ఈ మార్గాల్లో రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించే పనులు పూర్తయితే జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరడంతో పాటు రవాణా రంగం మెరుగుపడనుంది.
రాకపోకలు సౌకర్యంగా..
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హెచ్ఏఎం) పద్ధతిలో రహదారుల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జిల్లా నుంచి ఐదు రహదారులకు స్థానం దక్కింది. ఇవి మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో ఉండగా, రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రాకపోకలు సులువవుతాయ ని.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుందని భావిస్తున్నారు.
●వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తారు. జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల, ముజఫర్నగర్, జానకీపురం, పెద్ద బీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా, సోమవరం మీదుగా వైరా వరకు 25.2 కి.మీ. రహదారి విస్తరణకు రూ.151.20 కోట్ల నిధులు మంజూరు చేశారు.
●మధిర నుంచి జిలుగుమాడు, ఆత్కూరు, కృష్ణాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు 13.50 కి.మీ. మేర రహదారి విస్తరణకు రూ.81కోట్ల నిధులు కేటాయించారు.
●మధిర నుంచి ఇల్లెందులపాడు, దెందుకూరు మీదుగా ఎర్రుపాలెం వరకు 18.40 కి.మీ.మేర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇందుకోసం రూ.110.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
●ఖమ్మం నుంచి కొత్తూరు, ధంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణా పురం, పందిళ్లపల్లి, జగన్నాధపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు 28.03 కి.మీ. రహదారి విస్తరణకు రూ.157.23 కోట్లు మంజూరయ్యాయి.
●బోనకల్–ఆళ్లపాడు, రాయన్నపేట–వంగవీడు వరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు 15.72 కి.మీ. రహదారి అభివృద్ధికి రూ 94.32 కోట్ల నిధులు మంజూరయ్యాయి.


